శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (10:45 IST)

చంద్రబాబును కాల్చి చంపేయండి రచ్చ : జగన్‌కు ఈసీ షోకాజ్ నోటీసు

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో), కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ శనివారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
అలాగే, జగన్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ స్పందించి.. సుమోటోగా విచారణకు స్వీకరించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నుంచి వివరణ కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయితే జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
 
కాగా, ఈనెల 3న నంద్యాల సభలో జగన్‌ ప్రసంగించారు. 2014లో ఇచ్చిన హామీలు ఈ మూడేళ్లలో ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ ఘాటు పదజాలంతో విమర్శలు చేశారు. ‘చంద్రబాబును ముఖ్యమంత్రి అంటారా.. ముఖ్యకంత్రీ అంటారా..? చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదు. దొంగంటారా.. నీతిమంతుడంటారా..? ఇది దొంగల పాలనా.. ప్రజాపాలన అంటారా..? ఒక్క నిజం కూడా చెప్పని వాడిని నారా చంద్రబాబునాయుడు అంటారు..’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.