కోల్ స్కాం: దాసరి మెడకు ఉచ్చు..! ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రెడీ..!
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీమంత్రి, తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది.
దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.