మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:58 IST)

అద్దెకు ఉంటూ అందర్నీ నమ్మించాడు... ఊరికి వెళ్లి వచ్చేసరికి ఊడ్చేశాడు...

తమ ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి.. మంచివాడిగా ముద్రవేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి యజమాని తమ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లివచ్చేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చోరీ చేసి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్‌ జిల్లా, రాజపురం గ్రామానికి చెందిన విజయేంద్ర గత కొంతకాలంగా పీర్జాదిగూడ మున్సిపల్‌ పరిధిలోని సిరిపురి కాలనీకి చెందిన నరేంద్ర ఇంట్లో అద్దెకు ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా మంచివాడిగా ముద్రవేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో నరేంద్ర వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులకొట్టివుంది. బీరువాలో మూడు తులాల బంగారం మాయ‌మైందని గుర్తించిన నరేంద్ర వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
ఈ పరిస్థితుల్లో గురువారం మేడిపల్లి కమాన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ త‌నిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన విజయేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగ‌త‌నం చేసిన‌ట్టు అంగీక‌రించాడు. 
 
అద్దెకు ఉంటూ ఓనర్‌ ఇంట్లోనే దొంగ‌త‌నం చేసిన‌ట్టు విచార‌ణ‌లో పోలీసులు గుర్తించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3 తులాల నెక్లెస్‌, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.