శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (15:11 IST)

పార్టీ మారడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటంటే... : కార్యకర్తలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

సొంత పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం గత రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాచర్ల, గిద్దలూరు నేతలతో సమావేశమైన ఆయన, నేడు బెస్తవారిపేట, కొమరోలు గ్రామాలకు చెందిన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
 
ఈ సమావేశాల్లో ఆయన అడుగుతున్న ప్రశ్నలు విని అనుచరులు విచిత్రంగా చూస్తున్నారు. పార్టీ మారితే మీరంతా నా వెంట నడుస్తారా? టీడీపీలో మనకు సముచిత స్థానం లభిస్తుందా?, మీకు స్థానిక టీడీపీ నేతలకు ఘర్షణలు జరుగుతాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. 
 
అదేసమయంలో టీడీపీలోకి వెళ్లితే తనకు, కార్యకర్తలకు కలిగే ప్రయోజనలను వివరిస్తున్నారు. ఆయన మాటలను ఆలకించిన అత్యధిక కార్యకర్తలు పార్టీ మారదామనే వెల్లడించగా, కొందరు మాత్రం ఇప్పుడున్న టీడీపీ నేతలతో గొడవలు వస్తాయని, అందువల్ల తొందరపడొద్దని సలహా ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారాలని ఎపుడో నిర్ణయించుకోవడంతో తిరుపతి మహానాడు ముగిసిన తర్వాత ఈ నెలాఖరున విజయవాడలో సీఎం సమక్షంలో పచ్చ కండువా కుప్పుకోవాలని భావిస్తున్నారు.