గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:51 IST)

కాన్పు ఖర్చులకు డబ్బులివ్వలేదనీ భార్యను చంపేశాడు

కాన్పు ఖర్చులకు అత్తింటివారు డబ్బులు ఇవ్వలేదనీ ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో జరిగింది.

కాన్పు ఖర్చులకు అత్తింటివారు డబ్బులు ఇవ్వలేదనీ ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన వల్లాల ఏడుకొండలుకు అదే గ్రామానికి అనూష (19)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలల క్రితం ఆమె కొడుకును ప్రసవించింది.
 
తొలి కాన్పు అయ్యే ఖర్చులను అత్తింటివారే భరించాలని ఏడుకొండలు తెగేసి చెప్పాడు. దీనికి అత్తింటివారు సమ్మతించారు. అయితే, డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఏడుకొండలు కట్టుకున్న భార్యను హతమార్చాడు. ఆమె ఆరు నెలల శిశువుకు తల్లి అని కూడా చూడలేదు. పైగా, ఈ హత్యకు అతని తల్లిదండ్రులు కూడా సహకరించడం గమనార్హం. అత్తమామలైన బ్రహ్మయ్య, ధనమ్మలు అనూషను మంచంపై పడుకోబెట్టి కాళ్లు చేతులు నొక్కిపెడితే, ఏడుకొండలు గొంతునులిమి కడతేర్చాడు. ఈ దారుణం బుధవారం తెల్లవారుజామున జరిగింది. 
 
అరుపులు వినిపిస్తుంటే పక్కనున్న వారు వచ్చి చూసి అనూషను స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. ఆ తర్వాత అనూష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అదనపు కట్నం, ప్రసవ నగదు ఇవ్వలేదనే భర్త ఏడుకొండులు తన తల్లిదండ్రులతో కలిసి చంపాడని మృతురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పిడుగురాళ్ళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.