శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:36 IST)

మరో 48 గంటలు వానలే వానలు.. హైదరాబాద్‌లో కుండపోత

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 48 గంటలపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కు

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 48 గంటలపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒక మోస్తారు వర్షం, మరికొన్నిచోట్ల తేలికపాటిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వరంగల్లు జిల్లా నల్లబెల్లిలో 9 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో 8, కొందర్గులో 5, తిమ్మాజిపేటలో 5 సెం.మీ చొప్పున కురిసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో 6, గండీడ్‌లో 5, మార్పెల్లెలో 3 సెం.మీ చొప్పున వర్షం కురిసింది.
 
మరోవైపు హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచీ దట్టంగా మేఘాలు అలుముకుని వాతావరణం చీకటిగా మారింది. తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఉప్పల్‌, రామాంతాపూర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. 
 
కళ్ల ముందు కూడా ఏముందో తెలియని విధంగా దట్టమైన చీకటి అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా కార్యాలయాలకు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా సాగుతోంది. ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.