శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2015 (06:25 IST)

బలవంతపు భూ సేకరణ మానుకోండి... సిఆర్డిఏకు హైకోర్టు ఆదేశం.. రైతుల్లో ఆనందం

రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ ప్రాంతంలో పండగవాతావరణ నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
 
రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ నిడమర్రు గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనే సమీకరణకు సహకరించకపోతే భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇతర మంత్రులు చెప్పడంతో భయపడిన రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు.
 
అనంతరం భయంతోనే భూములు ఇచ్చామంటూ తమ అంగీకారపత్రాలు తిరిగి ఇవ్వాలంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు భూసమీకరణకు ఇష్టం లేని రైతులను మినహాయించాలని, అదేవిధంగా భయంతో అంగీకారపత్రాలు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వాలనీ, దీనిపై 15 రోజులలో నివేదిక అంద జేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ ఆదేశాలతో రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. పంటలు పండించుకునేందుకు కూడా అనుమతి రావడంతో పొలాల్లో దుక్కులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.