శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (17:43 IST)

టాక్స్ ఇష్యూ: టి. ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!

తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ ఇష్యూపై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను విషయంలో హైకోర్టు టి. సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సరుకు, ఇతర రవాణా వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
వచ్చే ఏడాది మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే ఇరు రాష్ట్రాల్లో తిరగడానికి వాహనాలకు అనుమతి ఇస్తూ గవర్నర్ జూన్ 1వ తేదీన 43వ నెంబర్ జీవో జారీ చేశారు. ఆ జీవోను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం 586 నెంబర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. 
 
ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలును ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ తిరుమల క్యాబ్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాల మధ్య వాహనాలు తిరగడానికి ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే చాలునని గవర్నర్ జారీ చేసిన జీవోను సమర్థించింది. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో నెబంర్ 43కు కట్టుబడి ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.