శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (13:44 IST)

వ్యభిచారం కేసుల్లో విటులనూ శిక్షించాలి : హైకోర్టు వ్యాఖ్యలు

పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న వ్యభిచారం కేసుల్లో కేవలం నిర్వాహకులు, యువతులను మాత్రమే కాకుండా, విటులను కూడా శిక్షించాలని హైదరాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తరహా దాడుల్లో పట్టుబడిన మహిళ, వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లపై మాత్రమే కేసు నమోదు చేయడం తగదని, విటుడిపైనా కేసు నమోదు చేసే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ అభిప్రాయపడ్డారు.
 
ఈ మేరకు చట్టానికి సవరణ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు తీర్పు కాపీలను పంపాలని ఆదేశించారు. 1956 ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం పరిధిలోనికి వ్యభిచార గృహాలకు వెళ్లే విటులు కూడా శిక్షార్హులేనంటూ చట్టానికి సవరణ తేవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర సాహితీవేత్తలు శ్రీరంగం శ్రీనివాసరావు, గురజాడ అప్పారావు రాసిన రచనలను ఉదహరించారు.
 
తనను బంజారాహిల్స్ పోలీసులు ఈ చట్టం సెక్షన్ 3 ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఓ పిటిషనర్ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి వ్యభిచార గృహాన్ని నిర్వహించడం, వ్యభిచారానికి అనుమతించడం, వ్యభిచారంపై వచ్చిన ఆదాయంతో జీవించడం, విటులను ఆకర్షించడం తదితరమైనవన్నీ సెక్షన్ 3,4,5 కింద వస్తాయన్నారు. ఇవన్నీ శిక్షార్హమైనవేనన్నారు. కానీ వ్యభిచార గృహాలకు వెళ్లే విటులపై కేసు నమోదు చేసే విధంగా చట్టంలో ఎక్కడా లేదని వివరించారు. ఇకపై విటులపైనా కూడా కేసు నమోదు చేసేలా చట్ట సవరణ చేయాలని ఆయన ఆదేశించారు.