శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (11:00 IST)

దంతాలను క్లీన్ చేయాలని ఆస్పత్రికి వెళితే 32 పళ్లు ఊడగొట్టారు...

దంతాలను శుభ్రం చేయించుకునేందుకు ప్రభుత్వ దవాఖానకు వెళితే సర్కారీ వైద్యులు మాత్రం 32 పళ్లను ఊడగొట్టారు. ఈ విషయాన్ని బాధితురాలు రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేయగా, అక్కడి ఉత్తర్వుల మేరకు రాంగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్, నందినగర్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పి.పాండురంగారావు (71) దంత సమస్య కోసం 2017 సెప్టెంబరు 4వ తేదీన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ దంత, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ బిందులను కలిశారు. దీంతో వారు 2017 సెప్టెంబర్ 17వ తేదీన అతని 32 పండ్లకు క్యాప్‌లు అమర్చారు. 
 
ఇందుకోసం వారు వైద్యులకు రూ.6.96 లక్షలను చెల్లించారు. ఆ తర్వాత కొంతకాలానికే పాండు రంగారావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మరోసారి కిమ్స్ దవాఖానకు వెళ్లగా డాక్టర్ ప్రత్యూష గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సేతుబాబు వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షలు నిర్వహించి మందులను వాడాలని సూచించారు. 
 
అవి వాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో ఆరోగ్యం దెబ్బతిని 32 పండ్లు ఊడిపోయాయి. దీంతో మానసిక ఆందోళనకు గురైన రంగారావు రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సంబంధిత వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.