శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)

వచ్చే 72 గంటల్లో దక్షిణాది రాష్ట్రాలకు పెనుముప్పు

వచ్చే 72 గంటల్లో దక్షిణాది రాష్ట్రాలకు పెను ముప్పు పొంచివుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం కారణంగా దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలతో కేరళలోని సుమారు 4 జిల్లాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. త్రిసూర్, ఎర్నాకుళం, అలుపుల, తిరువనంతపురం జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మత్య్సకారులను కూడా వేటకు వెళ్లొద్దని.. అధికారులు తెలిపారు.
 
అలాగే, ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని రామనాథపురంతో పాటు పలు జిల్లాల్లో మునుపటి కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. అక్టోబరు 30 వరకు అక్కడ భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
దీంతో మదురై, రామనాథపురం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బంగళాఖాతంలో అల్పపీడనం బలపడి కన్యాకుమారి వైపు కదులుతోంది. ఈశాన్య అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, మాల్దీవులు వైపుగా వెళ్లి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.