డబ్బులికి ''కోడ్'' పదంగా టన్ను: 500 టన్నుల స్టాక్ పంపండి: విజయసాయిరెడ్డి
టన్ను అనే పదాన్ని బరువును సూచించే ప్రమాణంగా వాడుతుంటాం. అయితే ఈ పదాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆడిటర్గానే కాకుండా.. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన విజయసాయిరెడ్డి డబ్బులకు ‘కోడ్’ పదంగా వినియోగించారని సీబీఐ అధికారులు శనివారం జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు చెప్పారు.
దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులతో ఈ మెయిళ్ల ద్వారా జరిపిన సంప్రదింపుల్లో విజయసాయి రెడ్డి డబ్బులకు కోడ్గా టన్ను అనే పదాన్నే వాడారని తెలిసింది. ‘‘3,500 టన్నుల స్టాక్ అందింది. మరో 500 టన్నుల స్టాక్ పంపండి’’ అంటూ సాయిరెడ్డి దాల్మియా సిమెంట్ ప్రతినిధులకు మెయిల్ పంపారట. దాల్మియా సిమెంట్స్కు చెందిన జోయ్ దీప్ బసు అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లోని సమాచారాన్ని విశ్లేషించిన సీబీఐ అధికారులకు ఈ ‘మెయిల్’ కనిపించింది.
సదరు మెయిల్ పంపిన సమయంలో సాయిరెడ్డి దాల్మియా సిమెంట్స్ నుంచి సిమెంట్ కానీ, స్టీలు కాని కొనుగోలు చేయలేదట. దీంతో ‘టన్ను’ అనే పదాన్ని డబ్బుకు కోడ్గానే సాయిరెడ్డి వాడారని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు కూడా తెలియజేశారని తెలుస్తోంది.