శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:34 IST)

రేప్ చేసిన పతోడిని ఎన్‌కౌంటర్ చేస్తారా?.. చిదంబరం కుమారుడు ప్రశ్న

పశువైద్యురాలు దిశా అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం పట్ల దేశం మొత్తం హర్షిస్తోంది. స్వాగతిస్తోంది. కానీ, కొందరు న్యాయవాదులు, రాజకీయ నేతలు మాత్రం ఇది మంచి పద్దతికాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 
దిశ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేసిన అరీఫ్, శివ, నవీన్, చెన్నకేశువులను శుక్రవారం వేకువజామున హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
దిశను హత్య చేసిన 10 రోజులకు వారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
అయితే, కొందరు మాత్రం పోలీసుల చర్యను తప్పుబడుతున్నారు. 'అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఎన్‌కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయి. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలుసు. కానీ, దానికి ఇది పద్ధతి కాదు' అని కేంద్ర మాజీ విత్తమంత్రి పి. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ప్రముఖ సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పందిస్తూ, 'తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది ఖచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, వారి రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్‌కౌంటర్లు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎన్‌కౌంటర్‌పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి' అని అన్నారు.