శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (07:37 IST)

ఇది ఢిల్లీ కాదు.. వారిది ఆప్ కాదు.. పోటీచేస్తే టీడీపీ గల్లంతే : జగన్

ఇక్కడున్నది ఢిల్లీ కాదనీ, తెలుగుదేశం పార్టీ గొప్పలు చెబుతున్నట్లు వారున్నది ఆమ్ ఆద్మీ పార్టీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ ఆర్ పార్టీ నాయకుడు జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గురువారం అనంతపురంలో ఆయన రైతు భరోసా యాత్రను ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందన్నారు. అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపికి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు  మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టక నిలువునా మునిగిపోయారన్నారు. కేవలం వడ్డీభారం రూ. 12 వేల కోట్లు రైతులపై పడిందని దీనికి కారణం బాబేనని మండిపడ్డారు.
 
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును బ్యాంకులు రుణాల ఖాతాలకు జమ చేసుకుంటున్నాయని డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని,  జగన్ అన్నారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దక్కలేదని చెప్పారు. ఏపీలో గత సీజన్లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు