ఎంసెట్ 2 రద్దు? ఎంసెట్ 3 ఉంటుందా! 29న తేల్చుతామన్న మంత్రి కడియం
ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైన కేసులో తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన విద్యార్థులు మరో రోజు పాటు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైన కేసులో తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన విద్యార్థులు మరో రోజు పాటు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈ లీకేజీ వ్యవహారంపై సీఐడీ పోలీసులు ప్రత్యేక నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇదే విషంయపై ఆ రాష్ట్ర విద్యామంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నివేదికను పూర్తిగా పరిశీలించి, ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. అందువల్ల ఎంసెట్ రద్దుపై తుది నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తామని తెలిపారు. అదేసమయంలో 70 వేల మంది విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నదే తమ అభిమతమన్నారు.
లీకేజీపై సీఐడీ నుంచి నివేదిక అందాకే ప్రభుత్వం స్పష్టమయిన ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థులకు అన్యాయం చేయబోమని అన్నారు. మరోవైపు వీసీల నియామకం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ.. తీర్పుపై ఇప్పుడే మాట్లాడలేమని అన్నారు.
కాగా, ఏ ప్రశ్నాపత్రం లీకైనా, పరీక్షను పూర్తిగా రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాసిన విద్యార్థినీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిన పక్షంలో విద్యార్థులు మరోమారు పరీక్షకు సిద్ధపడక తప్పదు.