శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (07:46 IST)

సదావర్తి భూముల కొనుగోలుపై లోకేష్ మాటలు నిజమేగా.. అంత డబ్బు ఎక్కడినుంచి తెస్తారు?

కోర్టు గుమ్మం ఎక్కినందుకు కొంప పోతే పోయింది. లిటిగేషన్ అర్థమైంది అంటూ వెనకటికి ఎవరో అన్నట్లుగా ఏపీ మంత్రి నారా లోకేష్ సదావర్తి భూములపై ఉమ్మడి హైకోర్టు తీర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అ

కోర్టు గుమ్మం ఎక్కినందుకు కొంప పోతే పోయింది. లిటిగేషన్ అర్థమైంది అంటూ వెనకటికి ఎవరో అన్నట్లుగా ఏపీ మంత్రి నారా లోకేష్ సదావర్తి భూములపై ఉమ్మడి హైకోర్టు తీర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా సై అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. 
 
ఈ విషయంపైనే మంత్రి నారా లోకేశ్ సోమవారం రాత్రి వెలగపూడి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సదావర్తి భూములను రూ.5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, కొనకుంటే ఛాలెంజ్‌లో వైఎస్సార్‌సీపీ ఓడినట్టేనని మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 
 
సదావర్తి భూముల వేలంలో అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసినప్పుడు రూ.5 కోట్లు అదనంగా ఇచ్చి మీరే తీసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారని లోకేశ్‌ గుర్తు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పిందని, రెండు వారాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కడతారో? ఏం జరుగుతుందో? చూద్దామని లోకేశ్‌ అన్నారు.
 
మాట ఇచ్చిన విధంగా అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోతే పిటిషనర్‌ రామకృష్ణారెడ్డికి రూ.కోటి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ, పిటిషనర్ డబ్బులు తెస్తారో లేదా కానీ, హైకోర్టు నాలుగు వారాల వ్యవధి ఇచ్చి వైకాపా ఎమ్మెల్యేకే సదావర్తి భూముల కొనుగోలు అవకాశం దఖలు పర్చడం ఏపీ ప్రభుత్వాన్ని నివ్వెరపర్చింది. వైకాపా ఎమ్మెల్యే అదనపు డబ్బులు చెల్లించి సదావర్తి భూములను కొనగలిగినట్లయితే అది ప్రభుత్వానికి తీరని అవమానం కలిగించక తప్పదని పరిశీలకుల ఉవాచ.