శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (14:13 IST)

ఆనం బ్రదర్స్ చేరికకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్‌ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతిచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆనం సోదరుల పునరాగమనంపై తాను చంద్రబాబుతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. 
 
అందువల్ల అనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు తమ పార్టీ స్వాగతం పలుకుతోందని అన్నారు. అందరమూ కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వాస్తవానికి వీరిద్దరి మాతృసంస్థ టీడీపీనే కావడం గమనార్హం. ఆరంభంలో తెదేపాలో ఉన్న వీరు.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇపుడు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
 
ఇదిలావుండగా, ఆనం సోదరులకు పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో తొలుత వైకాపాలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, అక్కడికి వెళ్లలేకనే టీడీపీని ఎంచుకున్నారని ప్రచారం లేకపోలేదు. మరోవైపు.. తెదేపాలో చేరే విషయంపై గురువారం జిల్లాలలోని పలు నియోజకవర్గాల కార్యకర్తలు, అనుచరులతో చర్చలు ఆనం బ్రదర్స్ చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెల్సిందే.