అయ్యో! ఏపీకి రాజధాని ఎక్స్ప్రెస్ కూడా లేనట్లేనా?
ఒక పక్క ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. మరోపక్క అమరావతి నిర్మాణానికి, ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఏపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే, ప్రధానిని కలవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో మరో షాక్ తగిలింది. ఏపీకి రాజధాని ఎక్స్ప్రెస్ కూడా లేదనట్లే అని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ఏపీకి రాజధాని ఎక్స్ప్రెస్ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని లోక్సభలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి నుంచి విశాఖ మీదుగా న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ ప్రవేశపెడుతున్నారా అని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ప్రశ్నించగా, దీనికి కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. వనరులు, నిర్వహణాపరమైన సమస్యల కారణంగా రాజధాని ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టడం లేదని వివరణ ఇచ్చారు. ఇదీ ఏపీ పరిస్థితి.