శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (17:38 IST)

తెలంగాణ ప్రత్యేక దేశం కాదు.. ప్రత్యేక రాష్ట్రమే... కేసీఆర్ గ్రహించాలి : పవన్ కళ్యాణ్

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో మరో కొత్త రాష్ట్రంగా ఏర్పాటైందే కానీ, ప్రత్యేక దేశంగా ఆవిర్భవించలేదనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్‌కు చురకలు అంటించారు. టీడీపీని ఆంధ్ర పార్టీగా అనుక్షణం చెబుతున్న కేసీఆర్... ఆంధ్రలో ఎన్నో పార్టీలున్నాయని, అందులో టీడీపీ కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ అన్నది దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే అని... ప్రత్యేక దేశం కాదన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా ఆయన మాట్లాడరాదని సూచించారు. 
 
అలాగే, ప్రతి అంశంలోనూ తనకంటూ అభిప్రాయాలు ఉంటాయన్నారు. కానీ, అందరి రాజకీయ నేతల్లా నేను నోరుపారేసుకోలేనని చెప్పారు. పైగా, ఇరు భుత్వాధినేతలు బాధ్యతగా మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేనిపక్షంలో ఇరు రాష్ట్రాల్లో సివిల్ వార్‌కు దారితీసి అంశాంతి నెలకొంటుందన్నారు. అంతేకాకుండా, మన రాజకీయ నేతల తీరుచూస్తుంటే 'కొడుకు తల్లి దగ్గరకెళ్లి ఏం చేసి బతకాలని అడిగితే, నోరుచేసుకుని బతకురా' అందట, అలా ఉంది మన నేతల తీరు' అని చెప్పారు. మన నేతలు నోరు పారేసుకుని బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
 
ఇకపోతే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కలిశానని గుర్తు చేసిన పవన్.. ఆ సమయంలో మోడీ తనతో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో భాగమని మోడీ అన్నారని చెప్పారు. దానిని నిజం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్‌గా పెట్టుకోవడంతో తెలుగు జాతి ఐక్యతకు తొలి అడుగు వేశారా అనిపించిందని ఆయన తెలిపారు. ఇందుకు కేసీఆర్ కు అభినందనలని పవన్ కళ్యాణ్ చెప్పారు.