ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు.. బాధ్యతను మాత్రమే గుర్తు చేశా: పవన్
నవ్యాంధ్ర రాజధాని భూముల విషయంలో తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని బాధ్యతను మాత్రమే గుర్తు చేశానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగని దిగజారుడు రాజకీయాలకు పాల్పడనన్నారు. ప్రజలు పిలిస్తేనే తాను రాజధాని ప్రాంతానికి వెళ్లానని చెప్పారు. అసలు పెద్ద మనుషల ఒప్పందాన్ని సరిగా అమలు చేయనందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు.
అన్యాయం జరిగిందని చెప్పానని, సమాజానికి ప్రశాంతత కల్పించాలని కోరానని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని మోదీకి అప్పుడే చెప్పానన్నారు. విభజన సమయంలోనే నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలసి సమస్యలు వివరించానన్నారు.