శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (17:48 IST)

ఖచ్చితంగా సాధ్యమే.. నన్ను నమ్మండి అని చంద్రబాబు నమ్మించి ముంచారు : పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలు జరుగుతాయా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలు జరుగుతాయా? సాధ్యమేనా? అని చంద్రబాబును అడిగితే, 'ఖచ్చితంగా సాధ్యమే.. నన్ను నమ్మండి' అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడేమో, రుణమాఫీ చేయకపోగా పాత రుణాలు కూడా కట్టమంటున్నారని, ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉందని పవన్ విమర్శించారు.
 
ఇకపోతే, ప్రస్తుతం రాష్ట్రంలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, 2019 ఎన్నికల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాజారాణి కల్యాణ మంటపంలో డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి.. ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా? లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.
 
డ్వాక్రా పథకం టీడీపీది కాదని, ఇది అంతర్జాతీయ పథకమని, ఆ పథకాన్నే టీడీపీ అమలు చేస్తోందని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి ఇవ్వడం లేదని, డ్వాక్రా సభ్యులకు ఇచ్చేది ప్రజల డబ్బు అని, మన అందరి ఉమ్మడి సంపద అని చెప్పారు. మీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని బలంగా నిలదీయండి.. సమస్య పరిష్కరిస్తారా? లేదా? అని ప్రశ్నించండి అని పవన్ సూచించారు. 
 
ఆడపడచులపై కేసులు పెట్టి ఇబ్బందిపెడితే ఊరుకోమని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. అలాగే, జనసేన శ్రేణులు, నాయకులకు కూడా డ్వాక్రా మహిళలు అండగా ఉండాలని కోరారు. త్వరలోనే డ్వాక్రా మహిళల సమస్యలపై విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఏడు లక్షల ఇరవై వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, వారి శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటోందని, వీళ్లకు సంబంధం లేకుండా వీళ్ల పేర్ల మీద వందల కోట్ల రుణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.