కేసీఆర్కు పవన్ చురక: తెలంగాణపై గబ్బర్ సింగ్ ప్రత్యేక దృష్టి!
తెలంగాణ సీఎం కేసీఆర్పై కౌంటర్ల వర్షం కురిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్లతో ఆపుకోకుండా.. తెలంగాణలో కేసీఆర్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ తెలంగాణలో విస్తరింపజేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలపై జనసేన దృష్టి సారిస్తుందని పవన్ కల్యాణ్ గురువారం తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని అన్నారు.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి ఉంటే... సమస్యలన్నీ పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని... ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బాధ్యత గల నాయకులెవరూ ఇలా వ్యవహరించరని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చురక అంటించారు. ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుంటుందని పరోక్షంగా కేసీఆర్ కు హితవు పలికారు.