శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (22:42 IST)

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ట్వీట్స్... చేయి దాటుతోంది బాబూ... ముద్రగడతో మాట్లాడమన్నారా...?!!

కాపు రిజర్వేషన్లపై తలెత్తిన ఆందోళనల నేపధ్యంలో కాపులను బీసీల్లో చేర్చాలని తూ.గోలో కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకొంది. వైద్య పరీక్షలకు ఆయన నిరాకరించడమే కాకుండా ఇంట్లో తలుపులు వేసుకుని ఎవ్వరినీ రానీయడంలేదు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తన సందేశాన్ని వెల్లడించారు. 
 
తను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నానని పేర్కొంటూ చంద్రబాబు సర్కారుకు కొన్ని సూచనలను చేశారు. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. కనుక ఈ రిజర్వేషన్ల విషయంలో సమస్యను మరింత జఠిలం చేయకుండా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. 
 
మేధావుల బృందాన్ని ఈ అంశం పరిష్కారానికి ఏర్పాటు చేయాలనీ, కాపు నేతలతో నేరుగా చర్చలు జరపాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైందనీ, వెంటనే ఈ విషయంపై స్పందించి పరిష్కారం కనుగొనాలని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ సారాంశాన్ని చూస్తుంటే నేరుగా ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆయన దీక్షను విరమింపజేసే ప్రయత్నం చేయాలన్నట్లుగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.