1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:32 IST)

ప్రేమించలేదని డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న అక్కసుతో డిగ్రీ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది ప్రెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ యువతి 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ రామచంద్రపుర్‌కు చెందిన రవళి (20) అనే విద్యార్థిని స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ యువతి వెంట అవినాష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడుతూ వచ్చాడు. అయినప్పటికీ రవళి అతన్ని పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో తనను ప్రేమించాలని పట్టుబడిన అవినాష్.. బుధవారం ఉదయం కాలేజీకి వెళుతున్న రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా అవినాష్ బెదిరించాడు. దీంతో వారు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న అవినాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.