భాజపా వేస్ట్... చిన్నమ్మ చూపు వైసీపీ వైపు... ఏపీలో మళ్ళీ ఒంగుళ్ళు దూకుళ్ళు!
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మళ్ళీ వేగంగా మారిపోతున్నాయి. గతంలో ఒక విడత పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. తర్వాత కొంత బ్రేక్ పడింది. ఇపుడు ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు తర్వాత, మరో విడత నేతల ఒంగుళ్ళు, దూకుళ్ళు ప్రారంభ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మళ్ళీ వేగంగా మారిపోతున్నాయి. గతంలో ఒక విడత పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. తర్వాత కొంత బ్రేక్ పడింది. ఇపుడు ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు తర్వాత, మరో విడత నేతల ఒంగుళ్ళు, దూకుళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. హోదాపై వచ్చిన వ్యతిరేకతను కవర్ చేసుకునేందుకు టీడీపీ మరోసారి తన ఆకర్ష్ వలను వైసీపీ, కాంగ్రెస్ నేతలపై వేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టీడీపీ తీర్థం ఇవ్వబోతున్నారు.
మరోపక్క ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును అడ్డుకున్నారని బీజేపీ, టీడీపీలపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బీజేపీని వీడేందుకు కొందరు నేతలు సిద్ధం అవుతున్నారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె త్వరలో బీజేపీని వీడి, వైసీపీ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కుదేలు కావడంతో పురందేశ్వరి బీజేపీలో చేరారు. విశాఖలో ఓటమి పాలవడంతో ఆమెకు బీజేపీలో సరైన బెర్త్ లభించలేదు.
ఇపుడు ప్రత్యేక హోదా లేదని బీజేపీ తేల్చేసిన తరుణంలో, చిన్నమ్మ ఇంకా బీజేపీలోనే కొనసాగితే, ఎన్టీయార్ ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని సన్నిహితులు ఆమెకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకోవడం అనుమానమేనని, దానికి గట్టి పోటీ ఇవ్వగల వైసీపీలో చేరితే బెటర్ అని పురంధేశ్వరి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వైసీపీ అధిష్ఠానంతో చర్చలు కూడా జరిగిపోయాయని, త్వరలో చిన్నమ్మ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం మాత్రమే మిగిలి ఉందని సన్నిహితులు పేర్కొంటున్నారు. మామకు వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును పదేపదే ఎద్దేవా చేసే జగన్ మోహన్ రెడ్డికి... చిన్నమ్మ వైసీపీలోకి వస్తే మరింత బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.