శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (03:03 IST)

ఈ ఏడాది కూడా ఆలస్యంగానే రుతుపవనాలు.. కానీ రేపటి నుంచి మనకు భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు శుభ వార్త. కాదు కాదు.. చల్లటి వార్త. బుధవారం నుంచి ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గత ఏడాది మాదిరిగానే రుతుపవనాలు ఈ సారీ ఆలస్యంగానే వస్తున్నప్పటికీ క్యుములో నింబస్ మే

రెండు తెలుగు రాష్ట్రాలకు శుభ వార్త. కాదు కాదు.. చల్లటి వార్త. బుధవారం నుంచి ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గత ఏడాది మాదిరిగానే రుతుపవనాలు ఈ సారీ ఆలస్యంగానే వస్తున్నప్పటికీ క్యుములో నింబస్ మేఘాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది., కానీ వర్షం పడని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిస్తాయని జూన్ 12 వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. జార్ఖండ్‌ నుంచి ఉత్తరకోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని.. దానివల్ల బుధవారం నుంచి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బుధవారం (7వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో.. 8, 9 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు వర్షాలు లేనిచోట మాత్రం అధిక ఎండలు ఉండే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని.. రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని చెప్పారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అడ్డుకుంటోందని వై.కె.రెడ్డి తెలిపారు. మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా.. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయని... అవి ముందుకు కదలడానికి అనువైన వాతావరణం లేదని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 8 నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు.
 
భూవాతావరణంలో 50 రకాల మేఘాలున్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల అంచనా. ఎంత ఎత్తులో ఉంటాయి.. అవి ఏర్పడే తీరు, వర్షం వస్తుందా.. రాదా అన్న లక్షణాల ఆధారంగా మేఘాలను వర్గీకరించారు. వీటిలో క్యుములోనింబస్‌ మేఘాలకు ప్రత్యేక స్థానముంది. ఈ మేఘాలను క్లౌడ్‌–9గా కూడా పిలుస్తారు. ఇంగ్లిష్‌ భాషా విశేషణాల ప్రకారం దీనికి అత్యంత ఉన్నతమైన, శక్తివంతమైన అని అర్థం. ఇవి భూ ఉపరితలానికి సుమారు ఏడు కిలోమీటర్లపైన.. అప్పటికప్పుడు భారీగా ఏర్పడుతాయి. ఇతర మేఘాలకంటే ఇవి భిన్నంగా ఒక్కసారిగా అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. 
 
ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో ఓ చోట ఏకంగా 37 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పింది.