శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (15:51 IST)

నేను రామసేతు ''ఉడుత''ను: రాజమౌళి

రామసేతు నిర్మాణంలో వానర సైన్యం పాల్గొందని.. ఆ వానరుల పేర్లు ఎవ్వరికీ అంతగా గుర్తుండవని.. కానీ ఓ ఉడుత పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొస్తుందని.. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా అలాం

రామసేతు నిర్మాణంలో వానర సైన్యం పాల్గొందని.. ఆ వానరుల పేర్లు ఎవ్వరికీ అంతగా గుర్తుండవని.. కానీ ఓ ఉడుత పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొస్తుందని.. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా అలాంటి ఉడుత పాత్రే తనదని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు.

రామసేతు నిర్మాణంలో తన వంతు సాయం చేసిన ఆ ఉడుతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ప్రస్తుతం ఆ ఉడుత పరిస్థితే తనదని బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి అన్నారు. ఆ ఉడుతలా అమరావతి రాజధాని నిర్మాణంలో తాను పాలుపంచుకుంటున్నానని జక్కన్న చెప్పారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జక్కన్న రాజమౌళి కూడా పాల్గొన్నారు. దీనికోసం సచివాలయానికి రాజమౌళి విచ్చేశారు. జక్కన్నతో పాటు మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు. 
 
ఇందులో భాగంగా రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, వివిధ విభాగాల డిజైన్లను ఈ సమావేశంలో ఖరారు చేశారని తెలుస్తోంది. భవన నమూనాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డిజైన్లకు సంబంధించి రాజమౌళి సూచనలు అందించారు. 
 
ఈ సమావేశానికి అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. డిజైన్లకు సంబంధించి కొన్ని సూచనలు చేశామన్నారు. అసెంబ్లీ మధ్య తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆ తల్లిపై సూర్యుని కిరణాలు పడేలా ప్లాన్ చేయమన్నామన్నారు. ఏపీ అసెంబ్లీ ఎలా వుండాలి.. అమరావతి నగర నిర్మాణం సంస్కృతికి అద్దం పట్టేలా వుండాలని సూచించినట్లు రాజమౌళి తెలిపారు. 
 
సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్య ఆకృతులు అమరావతి రాజధానిలో వుండాలని సూచించినట్లు రాజమౌళి వెల్లడించారు. 2019 మార్చిలోపు అమరావతి నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు రాజమౌళి అన్నారు.