శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:25 IST)

చారిత్రాత్మక తీర్పు: రేపిస్టులకు బతికున్నంతకాలం జైలుశిక్ష!

అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు కర్నూలు న్యాయస్థానం బతికున్నంత కాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రవి, శ్రీనివాస్ అనే ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇది అరుదైన తీర్పుగా చెబుతున్నారు. బుధవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
కర్నూలుకు చెందిన రవి, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నాయి. అయితే, వీరిలో కరుడు గట్టిన నేర ప్రవృత్తి ఉండటంతో తమ ఆటోలను ఎక్కిన యువతులు, మహిళలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారాలు చేస్తూ వచ్చారు. ఇలా వారిపై దాదాపు 20 వరకు అత్యాచారాలు, కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో గత యేడాది కర్ణాటకకు చెందిన ఒక మహిళను ఇదే విధంగా కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. 
 
దీనిపై బాధిత మహిళ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఓ యేడాది పాటు జైలు జీవితం గడిపిన వీరు గత జనవరి నెలలో బెయిలుపై విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి విడుదలైన కేవలం 20 రోజుల్లోనే మూడు రేప్‌లు, ఎనిమిది ఇతర నేరాలకు పాల్పడ్డారు. దీంతో వీరిని కిరాతక నేరగాళ్లుగా కర్నూలు పోలీసులు ప్రకటించి.. పట్టణ వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. ఆ వెంటనే రవిని అరెస్టు చేయగా, మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో కర్ణాటక మహిళపై అత్యాచారం కేసులో ఎస్సీఎస్టీ కోర్టు ప్రత్యేక కోర్టు మరియు కర్నూలు ఆరో అదనపు జిల్లా కోర్టు జడ్జి పి వెంకట జ్యోతిర్మయి బుధవారం తుదితీర్పును వెలువరించింది. ఇందులో రవితో పాటు.. శ్రీనివాస్‌లకు బతికివున్నంత కాలం కారాగారశిక్షలతో పాటు.. రూ.5 లక్షల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సొమ్మును బాధితురాలికి అందజేయాలని జడ్జి ఆదేశించింది.