బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (13:49 IST)

వైకాపా ఎమ్మెల్యే కృషి ఫలితం... రికార్డు ధర పలికిన సదావర్తి భూములు

అత్యంత వివాదాస్పదమైన సదావర్తి సత్రానికి చెందిన భూముల బహిరంగ వేలం పాట సోమవారం ముగిసింది. చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో ఈ భూముల బహిరంగ వేలం పాట జరిగింది.

అత్యంత వివాదాస్పదమైన సదావర్తి సత్రానికి చెందిన భూముల బహిరంగ వేలం పాట సోమవారం ముగిసింది. చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో ఈ భూముల బహిరంగ వేలం పాట జరిగింది. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో ఈ భూముల వేలం పాట నిర్వహించగా, ఈ పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ భూములను కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి రూ.60.30 కోట్లకు సొంతం చేసుకున్నారు. 
 
ఈ భూముల వేలం పాట ప్రారంభ ధర రూ.27.45 కోట్లుగా నిర్ణయించారు. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో 22 కోట్ల రూపాయలకు విక్రయించింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంతో విలువైన సదావర్తి భూమలను కారుచౌకగా కట్టబెట్టారంటూ తన పిటిషన్‌లో ఆరోపించారు.
 
దీనిని విచారించిన హైకోర్టు 22 కోట్ల రూపాయలకు అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ ఆయనకు ఆఫర్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో ధరావత్తు చెల్లించాలని సూచించింది. హైకోర్టు చెప్పినట్టుగానే ఆయన చెల్లించారు. అయితే, మరొకరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, బహిరంగ టెండర్ ఆహ్వానిస్తూ వేలం వేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
 
ఫలితంగా ఈ భూముల వేలం పాటను చెన్నైలో నిర్వహించారు. ఇందులో రికార్డు స్థాయిలో రూ.60.30 కోట్ల ధర పలికింది. గతలో కంటే ఈ దఫా రూ.37.90 కోట్ల మేరకు అదనంగా పలికింది. తితిదే నిర్ణయించిన ప్రాథమిక ధర కంటే ఇపుడు అదనంగా రూ.32.85 కోట్లు సమకూరింది.