జీహెచ్ఎంసీలో తెరాస వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: రేవంత్ రెడ్డి సవాల్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 100 సీట్లు గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని తెదేపా తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎన్నికల శంఖారావంలో ఆయన ప్రసంగించారు.
తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేయడంతోనే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ యువకులంతా మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆటవిక పాలన సాగుతోందని, హైదరాబాద్లోనూ బీసీలు, ఎస్సీలు తెరాస అక్రమాలను అడ్డుకొనేందుకు ధైర్యంగా ముందుకురావాలని విజ్ఞప్తిచేశారు.
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, తెరాస బెదిరింపులకు భయపడేదిలేదని టీడీపీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. జీహెచ్ఎంసీలో కావాల్సినన్ని నిధులున్నాయని, వాటిని కాజేయాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఈ సందర్భంగా కృష్ణయ్య ఆరోపించారు.