బాలాజీ ఎక్స్ ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం... 25 తులాల బంగారు అపహరణ..!
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించే రైళ్లలో భద్రత కరువైంది. పలు రైళ్లలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. తాజాగా తిరుపతి, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్న బాలాజీ ఎక్స్ ప్రెస్ రైల్లో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు పడ్డారు.
కడప జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలో రైలు వెళుతుండగా రైల్లోకి చొరబడిన దోపిడీ దొంగలు కత్తులతో ప్రయాణికులను బెదిరించారు. ఈ రైల్లో ఉన్న 7, 8, 9 బోగీల్లోని ప్రయాణికులపై దాడికి దిగిన దొంగలు మహిళల మెడల్లోని 25 తులాల బంగారాన్ని దోచుకున్నారు.
దోపిడీ దొంగల బీభత్సంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు రైలు గుత్తిలో ఆగగానే అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.