శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (12:55 IST)

ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్: రేసులో సైనా నెహ్వాల్!

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను కేసీఆర్ నియమించారు. ఇదే బాటలో, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నవ్యాంధ్రకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉంటే మంచిదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. దీనికోసం, పేరు ప్రతిష్టలతో పాటు నిబద్ధత ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
అయితే, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలా లేక త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోయే ఏడు మిషన్లకు వేర్వేరు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలా అని ఆంధప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
 
గతంలో, గుజరాత్ పర్యాటక శాఖకు అమితాబ్ బచ్చన్... పాఠశాలల్లో పరిశుభ్రత ప్రోత్సాహానికి ఆమీర్ ఖాన్... కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు విద్యాబాలన్‌లు బ్రాండ్ అంబాసిడర్లగా పనిచేశారు.
 
అయితే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో సైనా నెహ్వాల్‌ను ఎంపిక చేసే దిశగా రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన పత్రాలపై సీఎం చంద్రబాబుతో పాటు సైనా నెహ్వాల్ ‌సంతకాలు చేయనున్నారని సమాచారం. అంతేగాకుండా ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.