శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (16:52 IST)

సానియా-షోయబ్‌కు కాంట్రవర్సీలతో కష్టాలు: ఈద్‌కు ఓ వారానికి ముందు?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సానియా-షోయబ్‌లకు వివాహం సందర్భంగా పెద్ద హంగామా అయిన తరుణంలో మళ్లీ ఈ జంటను వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను టి. సర్కారు ఎంపిక చేయడంతో పలువురు నోళ్లలో నానుతున్న సానియాకు కొత్త చిక్కొచ్చిపడింది. 
 
వెస్టిండీస్ దీవుల్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సందర్భంగా విండీస్ బౌలర్ టినో బెస్ట్, పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అటుపై వీరిద్దరూ హోటల్లోనూ గొడవపడటంతో షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. 
 
దీనిపై, షోయబ్ మాలిక్ అర్ధాంగి, భారత టెన్నిస్ తార సానియా మీర్జా ఘాటుగా స్పందించారు. టినోను ఓ మూర్ఖుడిగా అభివర్ణిస్తూ, అతడిని షోయబ్ తన్నాల్సిందని ట్వీట్ చేసింది. సానియా ట్వీట్ పై ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె అలా ట్వీట్ చేయడం సరికాదని క్రీడా వర్గాలంటున్నాయి.
 
మరోవైపు సానియా మీర్జా పాకిస్థాన్ కోడలని.. ఉద్యమంలో పాల్గొనని ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమిస్తారని బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో వీహెచ్‌పీ, బీజేపీ నేతలు మండిపడుతున్నా.. దేశ వ్యాప్తంగా టెన్నిస్ తార అయిన సానియాకు సోషల్ మీడియాతో పాటు ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. వీరిలో ప్రముఖ గాయని ఆశాభోంశ్లే, సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, కిరణ్ బేడీ వంటి వారున్నారు.
 
అయితే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాదాలకు ఎప్పుడు తెరపడుతుందో తెలియదు కానీ.. ఈద్‌కి ఒకవారం ముందు ఇలాంటి కాంట్రవర్సిటీలతో కష్టాలేంటబ్బా అంటూ ఈ ఇండో-పాక్ జంట తలపట్టుకుంది. రంజాన్‌ను కూడా ప్రశాంతంగా.. హ్యాపీగా జరుపుకోలేమోనని భయపడుతున్నారు. ఎనీవే.. సానియా-షోయబ్‌ల వివాదాలు త్వరలో సమసిపోతాయని ఆశిస్తూ.. ఈద్ శుభాకాంక్షలు చెప్పేద్దాం.!