శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (10:15 IST)

‘రెండాకులు’ చేజారిందా.. సిగ్గులేదు.. ఆ మాట చెప్పడానికి.. దినకరన్‌పై శశికళ ఆగ్రహం

అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌పై దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌పై దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీతో పాటు.. ఆ పార్టీ రెండాకులు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలిసిన శశికళ తీవ్ర ఆగ్రహోద్రుక్తురాలయ్యారట. ముఖ్యంగా... ఎంతో నమ్మకంతో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇదా నీ నిర్వాకం అంటూ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
 
జయలలిత రాజకీయ జీవితంలో 32 ఏళ్లపాటు వెన్నంటి నడిచి, నమ్మకంగా నిలిచిన ఫలితంగా అన్నాడీఎంకే చిన్నమ్మ చేతుల్లోకి వచ్చింది. అయితే నిండా నెలరోజులు కాకమునుపే సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆమె మోజు తీరకుండానే అక్రమ ఆస్తుల కేసులో జైలుపాలయ్యారు. ప్రస్తుతం బెంగుళూరు జైలులో కారాగారవాసం అనుభవిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అర్కేనగర్‌లో ఉప ఎన్నికలు దినకరన్‌కు పెనుసవాళ్లు విసిరాయి. రెండాకుల చిహ్నంకై శశికళ, పన్నీర్‌ వర్గాలు పోటీపడ్డాయి. ఎన్నికల కమిషన్‌ వద్ద వాదోపవాదాలు వినిపించాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నందున రెండాకుల చిహ్నం తమకే దక్కాలని శశికళ వర్గం ఈసీ వద్ద మొరపెట్టుకుంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లనపుడు రెండాకుల గుర్తుకు వారు ఎలా అర్హులని పన్నీర్‌ వర్గం వాదించింది. 
 
రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్‌ ఎవ్వరికీ చెందకుండా చేయడంతోపాటు అన్నాడీఎంకే తరపున పోటీచేయరాదని ఆంక్షలు విధించింది. దీంతో దినకరన్‌ అన్నాడీఎంకే అమ్మ అనే పార్టీని స్థాపించి ఒక స్వతంత్య్ర అభ్యర్థిగా టోపీ గుర్తుపై పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారట.