బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (09:16 IST)

బాలికను ఇంటికి పిలిచి స్కూల్ కరస్పాండెంట్ లైంగిక దాడి.. నిజమేనన్న భార్య...

విశాఖపట్టణంలో ఓ యువతి స్కూల్ కరస్పాండెంట్‌ చేతిలో లైంగికదాడికి గురైంది. పైగా, తన భర్త లైంగిక దాడికి పాల్పడిన నిజమేనని కామాంధుడి భార్య చెప్పడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ

విశాఖపట్టణంలో ఓ యువతి స్కూల్ కరస్పాండెంట్‌ చేతిలో లైంగికదాడికి గురైంది. పైగా, తన భర్త లైంగిక దాడికి పాల్పడిన నిజమేనని కామాంధుడి భార్య చెప్పడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఒకేషనల్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ, విద్యార్థులు రోడ్డుకెక్కిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకోగా, అతని భార్య సైతం విద్యార్థినులకు మద్దతు పలికి, తన భర్త చేసే దుర్మార్గాలను బయటపెట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 
 
విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో గాది వెంకట సత్య నరిసింహ కుమార్‌ అనే వ్యక్తి కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఆయన తల్లి ఇటీవల మరణించింది. దీంతో ఇంటి పనుల కోసం తన వద్ద చదివే ఓ బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత భార్య మరో గదిలో ఉన్న సమయంలో ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
నరిసింహ కుమార్ వికృత చేష్టలకు భయపడిపోయిన ఆ బాలిక.. అతని కాళ్లు పట్టుకుని బతిమిలాడి, అక్కడి నుంచి బయటపడింది. ఆ తర్వాత తన సహచర విద్యార్థినిలకు చెప్పి.. కరస్పాండెంట్‌ను నలుగురి ముందూ నిలదీసింది.
 
అయితే, కరస్పాండెంట్‌కు ప్రిన్సిపాల్ గ్లోరీ మద్దతు తెలుపడంతో విద్యార్థినిలును ఏం చేయలేక పోయారు. ఇంతలో నరిసింహ కుమార్ భార్య రంగంలోకి వచ్చి.. ఆ బాలికపై తన భర్త లైంగిక దాడికి పాల్పడింది నిజమేనని చెప్పింది. పైగా, ప్రిన్సిపాల్ గ్లోరీకి తన భర్తకు అక్రమ సంబంధం ఉందనీ, తన భర్తను తనకు దూరం చేసిందని ఆరోపించింది. 
 
తన భర్తపై గతంలోనూ మూడు లైంగిక వేధింపుల కేసులున్నాయని తెలిపింది. నర్సీపట్నంలో కళాశాలను నడిపిన వేళ, పోలీసు కేసులు నమోదైనాయని, అక్కడ కాలేజీలు మూసి ఇక్కడికి వచ్చాడని వివరించింది. అందువల్ల తన భర్తతో పాటు.. కాలేజీ ప్రిన్సిపాల్ గ్లోరీకి శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.