శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (09:13 IST)

పాలకులు కాదు... హిరణ్యకశిపులు : పవన్ కళ్యాణ్ ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీ పాలకలుపై మరోమారు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, మంత్రులను లక్ష్యంగ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీ పాలకలుపై మరోమారు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. నేటి పాలకులు హిరణ్యకశిపుల్లా తయారయ్యారని మండిపడ్డారు.
 
విశాఖపట్టణంలో నిర్వహించిన భూ నిర్వాసితుల జనసభలో ఆయన నిప్పులు చెరిగారు. ఇక్కడి రైతులు కూడా మహారాష్ట్ర రైతుల్లా హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఆ పోరాటాన్ని ఉండవల్లి నుంచే మొదలు పెడతామని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేద్దామని అన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదంటూ ధ్వజమెత్తారు. కనీసం ఆయన కుమారుడు లోకేశ్‌‌ను పంపితే అయినా చూపిస్తానని పవన్ సూచించారు. 
 
"2014 ఎన్నికల్లో నేను అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్లనే తెలుగుదేశం గెలిచింది. అయినా ఆ పార్టీకి విశ్వాసం లేదు. గంటా శ్రీనివాసరావుకు సపోర్టు చేశాను. కానీ ఆయన తన భూములు, వ్యాపారాలను పెంచుకోవడానికి అధికారాన్ని వాడుకున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా హోదా విషయంలో మాటలు మారుస్తున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు. 
 
"రాష్ట్రంలో వేల ఎకరాలను పరిశ్రమల కోసం సేకరిస్తున్నారు. రైతులకు పూర్తి పరిహారం, పునారావాసం కల్పించకుండా అన్యాయం చేస్తున్నారు. ఆ భూముల్లో ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. ఇటు వ్యవసాయం కూడా చేయనివ్వడం లేదు. అభివృద్ధిని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒకరి బాగుకోసం మరొకరి జీవితాలను ఎలా నాశనం చేస్తారు" అంటూ నిలదీశారు.