శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 19 ఏప్రియల్ 2017 (20:01 IST)

రైతాంగాన్ని ఆదుకోవడంలో మాదే అగ్రస్థానం : మంత్రి సోమిరెడ్డి

విజయవాడ: రైతాంగాన్ని ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా.. తక్షణ సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటామని సచివాలయంలో జర

విజయవాడ: రైతాంగాన్ని ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా.. తక్షణ సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటామని సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. మిర్చి ధర పడిపోతే 1500 రూపాయల వంతున అదనంగా ఇవ్వాలని నిర్ణయించామని.. అలాగే పసుపు రైతుల్ని కూడా ఆదుకోడానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సోమిరెడ్డి చెప్పారు. 
 
పసుపు ధర క్వింటా ఎనిమిది వేల నుంచి 4,500 రూపాయలకు పడిపోయిందని.. ఈ పరిస్థితుల్లో తక్షణం స్పందించి.. అధికార యంత్రాంగం, రైతు సంఘం నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో బుధవారం విస్తృ చర్చలు జరిపి.. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఫైన్ క్వాలిటీ పసుపును క్వింటా 6,500 రూపాయలకు, సెకండ్ క్వాలిటీ పసుపును క్వింటా ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర లక్షల క్వింటాళ్ల పసుపు ఉత్పత్తి జరిగిందని.. ఈ పంటను కొనుగోలు చేయడానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 
 
రాష్ట్రంలో కడప, దుగ్గిరాల మార్కెట్ యార్డుల్లో మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయిస్తామన్నారు. మిర్చి పంటను గుంటూరు మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తున్నామని.. గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించిన మిర్చి కొనుగోలుకు కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ పంట ధర పడిపోయినా.. రైతులు ఇబ్బంది పడకుండా ఆదుకోవడంలో తాము ముందుంటున్నామని చెప్పారాయన.
 
రైతు రుణ ఉపశమన పథకం అమలు చేయాలని భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన విధివిధానాల కోసం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని నిర్ణయించుకుందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ అధికార యంత్రాంగం త్వరలో ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన రుణమాఫీ పథకం.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారిందని రాష్ట్ర మార్కెటింగ్, పశు సంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌తో పాటు, తమిళనాడు, మహారాష్ట్ర తదితర అనేక రాష్ట్రాలు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. వ్యవసాయం, నీటి పారుదల రంగాల అభివృద్ధి విషయంలో ముందున్నామని, నీటి వసతి లేని ప్రాంతాల్లో పంటలు కాపాడుకోడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారాయన. మార్క్ ఫెడ్ రంగంలోకి దిగితే.. ధరలు పడిపోకుండా ఆగిపోవడాన్ని గమనించామని.. అందుకే మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారాయన. అలాగే విత్తన సబ్సిడీ కింద రూ. 220 కోట్లు కేటాయించామన్నారు.