ఏడో రోజుకు చేరిన జగన్ దీక్ష భగ్నం: గుంటూరు ఆస్పత్రిలో చికిత్స..!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జగన్ శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆయన శరీరంలో కీటోన్స్ సంఖ్య ప్రారంభించింది.. దీంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు జగన్ను దీక్ష విరమించాలని కోరగా, ఆయన నిరాకరించారు.
ఇక చేసేది లేక భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేశారు. అంబులెన్స్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి, వైద్యం నిమిత్తం జగన్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మంగళవారం తెల్లవారుజామున దీక్షా ప్రాంగణానికి చేరుకున్న పోలీసులు వెంటనే మీడియా కెమెరాల వైర్లను కట్ చేశారు. లైట్లను ఆర్పి.. ఆపై జగన్ను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి ఓ స్ట్రెచ్చర్పై తీసుకెళ్లి అంబులెన్స్లోకి ఎక్కించేశారు.
ఈ సమయంలో కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, వారిపై లాఠీచార్జ్ ప్రయోగించారు. ఆంబులెన్స్కు దారికల్పించేందుకు లాఠీలు ఊపుతూ, కొందరు పోలీసులు దాని ముందు పరుగులు పెట్టారు. జగన్ ఉన్న అంబులెన్స్ను డైరెక్టుగా జీజీహెచ్కి తీసుకెళ్లి ఆయన్ను ఐసీయూలో చేర్చారు. ఆపై దీక్ష విరమించేందుకు జగన్ నిరాకరించగా, బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. 24 గంటల తర్వాతే ఘనాహారం ఇవ్వడం చేయాలని వైద్యులు తెలిపారు.