1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 5 జులై 2018 (17:05 IST)

అగ్నికి ఆజ్యంపోసిన మోదీ సర్కారు.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసింది..

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చెప్పింది. అయితే తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వలేం, ఏపీకి అన్ని చేశాం... ఇక చేసేదేంలేదంటూ, సుప్రీంకోర్టుకు అఫి

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చెప్పింది. అయితే తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వలేం, ఏపీకి అన్ని చేశాం... ఇక చేసేదేంలేదంటూ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది నరేంద్ర మోడీ సర్కారు. ఇప్పటికే హోదా, విభజన హామీలపై ఏపీలో పలు దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ అగ్నికి ఆజ్యంపోసేలా, నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కుండబద్దలుకొట్టింది. ఏపీకి చేయాల్సిందల్లా చేసేశాం. ఇక జేబులు ఖాళీ అయ్యాయంటూ కేంద్రం పేర్కొంది. ఒకవైపు ప్రత్యేక హోదాపై ఏపీ రగులుతోంది. కడప ఉక్కు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, విభజనచట్టం హామీలపై మాటల తూటాలు పేలుతున్నాయి. కానీ అన్నింటికీ తెగించినోడికి అడ్డేముంది అన్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ముఖంమీదే కొట్టినట్టు చెప్పేస్తోంది 
 
విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో, ఎంపీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా, అఫిడివిట్ దాఖలు చేసింది కేంద్రం ప్రభుత్వం. 
 
కేంద్రం ఫైల్ చేసిన అఫిడివిట్‌లో ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదని తెలిపింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు అధికారికంగా చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని నివేదించింది.
 
అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ప్రస్తావనే తేలేదు. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు.