శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (08:46 IST)

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రారంభం

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మీడియా హడావుడికి దూరంగా అంత్యక్రియలు ముగించాలని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్‌ మృతదేహం ఆయన మరణించిన ఐదు రోజులకు సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. కాన్సస్‌ నుంచి ముంబైకి చేరుకున్న ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రత్యేక విమానం సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్‌లో లాండయింది. మృతదేహంతోపాటు శ్రీనివాస్‌ భార్య సునయన, బంధువులు ఉన్నారు. మరోవైపు.. కుమారుడి మృతదేహాన్ని తీసుకునేందుకు శ్రీనివాస్‌ తల్లిదండ్రులతోపాటు వారి సమీప బంధువులు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, కుత్బుల్లాపుర్‌ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికారుల సమక్షంలో శ్రీనివాస్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తర్వాత 11.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో బాచుపల్లి ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి తరలించారు. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మధుసూదన్ , తల్లి వర్షిణి కుప్పకూలిపోయారు. బంధువులు బోరున విలపించారు. ఈ సమయంలో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. 
 
జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మీడియా హడావుడికి దూరంగా అంత్యక్రియలు ముగించాలని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9.30 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.