శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (16:58 IST)

వికలాంగులను మా స్కూల్‌లో చేర్చుకోం.. టీసీ ఇచ్చి పంపేసిన హెచ్ఎం.. సూళ్లూరుపేటలో దారుణం

చదువుకునేందుకు ముందుకు వచ్చే వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ఉపకారవేతనలిచ్చి మరీ ప్రోత్సహిస్తూ చదివిస్తోంది. అలాంటి వారికి మంచిగా చదువు చెప్పాల్సిన గురువులు.. వారిని చిన్నచూపు చూస్తూ తోటి విద్యార్థుల ముందు అవమానిస్తున్నారు. మా స్కూల్‌ల్లో వికలాంగులకు చోటులేదంటూ అడ్మిషన్ జరిగిన పాపకు ప్రధానోపాధ్యాయురాలు టీసీ ఇచ్చి పంపించేసింది. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆ పాప పేరు గుణకల స్నేహారిక. పుట్టుకతోనే ఓ కాలుకు వైకల్యం సంభవించింది. సూళ్లూరుపేటలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో చేర్పించాడు. మూడు రోజులు గడిచాక పాపకు వైకల్యం ఉందంటూ గురువారం మహిళా హెచ్ఎం టీసీ ఇచ్చి పంపేసింది. ఎంత ప్రాధేయపడినా ఆమెలో కనికరం కరువైంది. అంతేనా... 'వికలాంగులను మా పాఠశాలలో చేర్చుకోం.. నాకు తెలియకుండా అడ్మిషన్‌ జరిగింది. టీసీ తీసుకెళ్లి ఎక్కడైనా చేర్చుకో' అంటూ ప్రధానోపాధ్యాయిని చెప్పేసింది. అడ్మిషన్‌ చేసుకున్న ఉద్యోగిపై కూడా చిర్రుబురులాడింది. ఆ బాలిక వల్ల మిగిలిన విద్యార్థులకు ఆటంకం కలుగుతుందని ఆ పాపముందే చెప్పడంతో ఆ తండ్రి సుబ్రహ్మణ్యం కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. 
 
చివరకు చేసేందేం లేక టీసీ తీసుకొని పక్కనే ఉన్న బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్చించాడు. ఈ విషయం వారికి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ విషయం తెలుసుకొని నోరెళ్లబెట్టారు. ఆ పాపను ఆ పాఠశాలలో చేర్చుకున్నారు. కాగా ఈ సంఘటన తెలిసే సరికి సాయంత్రం పాఠశాల మూసివేశారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరేందుకు ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాలేదు.