శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (19:15 IST)

మూడు రాజధానులు ఆచరణ సాధ్యంకాదు: జగన్‌కు సుజనాచౌదరి లేఖ

సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి లేఖ రాశారు. రాజధాని మార్పుపట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్‌ బాధ్యతలు స్వీకరించాక అమరావతిలో 42 వేల కోట్ల పనుల్ని కారణం లేకుండా నిలిపివేశారని సుజనాచౌదరి పేర్కొన్నారు.
 
సుజనా చౌదరి లేఖలో పేర్కొన్న మరిన్ని అంశాలివే..
విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రుల ప్రకటనలు, రాజధానిలో ఆందోళనలు బాధ కల్గిస్తున్నాయి. రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా దుష్ఫ్రరిణామాలను చూపిస్తుంది.
రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తరలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని లేఖలో సుజనా చౌదరి సూచన.
 
12 శాతం భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, 88 శాతం భూముల్ని నిరుపయోగంగా మారుస్తారా?
ఇన్ సైడ్ ట్రేడింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు నేను మిమ్మల్ని కోరాను. రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు అవుతుందని మీరు చేస్తోన్న వాదన కూడా నిజంకాదు.. సత్యదూరం.

మూడు రాజధానులు ఆచరణ సాధ్యంకాదు
రాజధాని తరలిస్తే రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి.

చెట్టును రక్షిస్తే అది మనకు నీడనిస్తుంది.. అమరావతిని రక్షిస్తే అది రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి.