శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (11:32 IST)

ఏపీకి ప్రత్యేక హోదా రాదు.. ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు : జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదని ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసని ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టంచేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదంటూ కేంద్రమంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని సీఎం చంద్రబాబుకు ఎప్పుడో అవగతమైందన్నారు. అందుకే అదనంగా నిధులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఉందని, అందుకే టీడీపీ వాళ్లు, ఎంపీలు ప్రయత్నించడం లేదన్నారన్నారు.
 
ఆయన చెప్పినట్టుగా తాము లోక్‌సభ లోపల, బయట ఆందోళన చేశామన్నారు. సార్.. స్వామి అంటూ బతిమిలాడామన్నారు. అంతకంటే తామేం చేయగలమన్నారు. హోదా కోసం పవన్ ముందుకొస్తే ఆయనవెంట నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే తాజాగా ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి స్పష్టమైందన్నారు. అధికారంలోకి రాకముందు ఒకవిధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా పాలకులు మాట్లాడుతున్నారంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇక ప్రత్యేక హోదాపై ధర్నాలు, దీక్షలంటూ వైఎస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.