గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (12:32 IST)

శ్రీకృష్ణుడిగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ : హలో... వెంకటేష్, మేడమ్ ప్లీజ్... వెంకయ్య

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, పుత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మరోసారి వినూత్న వేషధారణలో రాష్ట్ర హోదా కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలో పార్లమెంట్ ముందు దర్శనమిచ్చారు. 
 
తలపై కిరీటం పెట్టుకున్న ఆయన చేతిలో పిల్లన గ్రోవి పట్టుకున్నారు. పార్లమెంటు రెండో దశ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 
 
ఏపీ విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న వేళ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనదైనశైలిలో వ్యవహరించారు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో, తన స్థానం నుంచి లేచి నిలబడిన వెంకయ్య, సభా సంప్రదాయాలను గౌరవించాలని, తానో ప్రకటన చేయాలని భావిస్తున్నానని, దాన్ని వినేందుకైనా సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని అన్నారు.
 
అప్పటికీ వెల్‌ను ఎవరూ ఖాళీ చేయకపోవడంతో, కనీసం తన ప్రకటన పూర్తయ్యేంత వరకైనా నినాదాలు ఆపాలని కోరారు. తన వద్ద వేర్వేరు సభ్యులకు చెందిన వేర్వేరు నోటీసులు ఉన్నాయని, వాటిపై సభ దృష్టికి ఓ మాట చెప్పాలని అనుకుంటున్నానని, తాను చెప్పిన విషయం నచ్చకుంటే, ఆప్పుడు మీరు నిరసనను కొనసాగించ వచ్చని సూచించారు. 
 
"ప్లీజ్ తెలుగుదేశం ఆల్సో... హలో... వెంకటేష్, మోహన్ రావ్, మేడమ్ ప్లీజ్... రామచంద్రరావు మీ స్థానాల్లోకి కాసేపు వెళ్లండి. కేవలం కొద్దిసేపే. కాసేపు వెనక్కు వెళ్లండి. కాసేపే..." అని బుజ్జగించడంతో ముందు టీడీపీ సభ్యులు, ఆ వెనకాలే కేవీపీ తమ స్థానాల్లోకి వెళ్లారు. ఆపై కూర్చోని కూడా కామెంట్లు ఎవరూ చేయవద్దని సూచిస్తూ తన ప్రకటనను కొనసాగించారు. దీంతో టీడీపీ ఎంపీలు కొద్దిసేపు మిన్నకుండిపోయారు.