శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (16:54 IST)

ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేదు... ముఖ్యమంత్రి చంద్రబాబు

‘‘విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మన రాష్ట్రానికి న్యాయం చేయమని ఎంపిలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజాప్రతినిధుల పోరాటం, అధికార యంత్రాంగం

‘‘విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మన రాష్ట్రానికి న్యాయం చేయమని ఎంపిలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజాప్రతినిధుల పోరాటం, అధికార యంత్రాంగం కృషి రాష్ట్రం ప్రయోజనాల కోసమే’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి ‘‘నీరు-ప్రగతి, వ్యవసాయం’’ పురోగతిపై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
 
‘‘ఎవరి దయాదాక్షిణ్యాలతో మనకు పనిలేదు. మన సామర్ధ్యమే మనకు శ్రీరామరక్ష. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. మన కష్టమే మనకు అక్కరకు వస్తుంది. సంక్షోభంలో మరింత సామర్ధ్యంతో పనిచేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరూ పాటుబడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మన రాష్ట్రావతరణను ఒక వేడుకగా కాకుండా ఒక సంకల్పంగా, ఒక దీక్షగా తీసుకుని కసిగా పని చేస్తున్నామనేది ప్రతిఒక్కరూ గుర్తుంచు కోవాలన్నారు. నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం నేపథ్యాలను స్ఫురణకు తెచ్చుకోవాలన్నారు.
 
మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్టమైన వ్యవస్థ రావాలి: 
‘‘మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్టమైన వ్యవస్థ తీసుకురావాలి. ప్రతి రైతుకు లాభదాయకమైన ధర లభించే వ్యవస్థ రావాలి. గతంకన్నా కౌలురైతులకు పంట రుణాలు నాలుగైదు రెట్లు అధికంగా ఇచ్చాం. కౌలురైతుల్లో పూర్తి సంతృప్తి ఉంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పటివరకు 78% పంటరుణాలే ఇచ్చారు.రుణాల లక్ష్యం 100% చేరుకోవాలి.’’ అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పంటలకు ఏవిధమైన తెగుళ్లు సోకకుండా పరిశోధనలు చేయాలన్నారు. పండ్లతోటల సాగు ఎంత పెరిగితే అంత లాభం అంటూ, కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం జరగాలనేది మన లక్ష్యంగా వివరించారు. సూక్ష్మసేద్యం లక్ష్యం 68% మాత్రమే చేరుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు.
 
జలసంరక్షణ ఉద్యమం రెండవదశ పనులు ముమ్మరం చేయాలని, చెరువుల పూడికతీత, ముళ్ల కంపల నరికివేత వేగవంతం చేయాలని ఆదేశించారు. మనం ఎక్కడ ఉన్నాం, ఎంత సాధించాం, ఇంకా ఎంత సాధించాలి అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి అన్నారు. పశుగ్రాసం, సైలేస్, గ్రీన్ పౌడర్, డిఎంఆర్ పంపిణీ చేయాలని, పాల ఉత్పాదకత పడిపోకుండా చూడాలని సూచించారు. పశుగణాభివృద్ధి రంగంలో వృద్ధి ప్రస్తుత లక్ష్యం 15%లో 12.5%మాత్రమే సాధించామనీ, 20% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.