మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:05 IST)

బీజేపీకి ఏపీ ప్రజలు సమాధి కడుతారు : సీఎం రమేష్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామంటూ నాలుగేళ్లపాటు ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించిన భారతీయ జనతా పార్టీపై టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆగ్రహం, ఆక్రోశం వెళ్ళగక్కారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామంటూ నాలుగేళ్లపాటు ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించిన భారతీయ జనతా పార్టీపై టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆగ్రహం, ఆక్రోశం వెళ్ళగక్కారు. అడ్డగోలుగా విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి చేశారనీ, అలాగే, తమను మోసం చేసినందుకు కమలనాథులకు కూడా ఏపీ ప్రజలకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. 
 
బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాలుపంచుకుని మాట్లాడుతూ, 'తెలుగు ప్రజలను అవమానించిన కాంగ్రెస్‌ గతి ఎన్నికల్లో ఏమైందో చూశాం. డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు కక్ష తీర్చుకున్నారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. ఇక ఓపికపట్టే రోజులు పోయాయి. మంజూరైన విద్యా సంస్థలకు వేల కోట్ల విలువ చేసే భూమిని ఉచితంగా ఇస్తే నిధులు ముష్టిగా వేస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకకు మెట్రో ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చారు. 
 
విశాఖపట్నం మెట్రోను మాత్రం విస్మరించారు. మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే. ఏవేవో కారణాలు చెప్పి రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడం లేదు. సంస్థలు, ప్రాజెక్టులు అంటే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపునకు ఆర్థిక అంశంతో సంబంధం లేదు కదా. ఇది రాజకీయ నిర్ణయం. ఎందుకు చేయడం లేదు' అంటూ సభా సాక్షిగా నిలదీశారు. అయినప్పటికీ బీజేపీ పెద్దలు మౌనమే తమ సమాధానంగా తమ సీట్లలో కూర్చొండిపోయారు.