శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2017 (21:21 IST)

టెక్నాలజీతో సుపరిపాలన అందిస్తున్నా... సీఎం చంద్రబాబునాయుడు

అమరావతి: టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన, సుపరిపాలన అందివ్వడమే కాకుండా అవినీతిని అరికట్టడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మహిళల మనోభావాలకు ప

అమరావతి: టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన, సుపరిపాలన అందివ్వడమే కాకుండా అవినీతిని అరికట్టడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మహిళల మనోభావాలకు ప్రాధాన్యతిస్తూనే ప్రజారోగ్య పరిరక్షణకు బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలిస్తామన్నారు. ఇళ్ల మధ్య ఉండే షాపులను సుదూర ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.
 
అవినీతికి తావేలేని మెరుగైన, పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామన్నారు. పరిష్కార వేదిక 1100 ద్వారా ప్రజలతో నిత్యం అనుసంధానమవుతున్నామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఒక వైపు ప్రజా సమస్యలు పరిష్కారిస్తూనే, మరోవైపు అధికారుల్లో జవాబుదారీతనం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
ఇసుక దందాలపై ఉక్కుపాదం
ఇసుక సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దందాలు చేసిన సహించేదిలేదని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. స్థానికులు, కూలీలు కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచితే సహించేదిలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను సరఫరా చేస్తే పీడీ యాక్టులతో పాటు అరెస్టులు కూడా చేస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాలతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 406 ఇసుక రీచ్‌ల వద్ద అధికారులను నియమించడంతో పాటు రహదారులు కూడా నిర్మిస్తామన్నారు. దీనివల్ల ఇసుక దందా తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు.
 
మొబైల్ రైడింగ్ పార్టీలు ఏర్పాటు...
రాష్ట్రంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం బెల్ట్ షాపులు అరికట్టాలని ప్రయత్నిస్తుంటే, కొందరు కిరాణా షాపుల్లోనూ, వాహనాల ద్వారానూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. ఇటువంటి వారిపై కఠినంగా వ్యహరిస్తామన్నారు. ఇందుకోసం మొబైల్ రైడింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన షాపుల్లో కాకుండా ఎక్కడై మద్యం బాటిళ్లు లభ్యమతే, అందుకు ఆ షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల మధ్య ఉంటే మద్యం షాపులను వాటికి దూరంగా తరలించాలని ఇప్పటికే సంబంధిశాఖాధికారులకు ఆదేశించామన్నారు. మహిళల మనోభావాలను కాపాడడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం  కట్టుబడి ఉందన్నారు. 100 శాతం బెల్ట్ షాపులను కంట్రోల్ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
 
వచ్చే నెల 5 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జలహారతి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టులు, చెక్ డ్యామ్ లు, పంట కుంటలు, ఇతర నీటి వనరుల వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కృష్ణా జలాలపై ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎగువ రాష్ట్రాలు కనీస మానవ ధర్మాన్ని కూడా పాటించడం లేదన్నారు. కింద రాష్ట్రాలకు రావాల్సిన నీటి వాటాను సైతం ఇవ్వకుండా తమ డ్యామ్ ల్లో నీటిని నిల్వ ఉంచుకుని, తమ రాష్ట్రాల్లో ఉన్న చెరువులకు, కాలువలకు మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు తరలిస్తున్నారన్నారు. దీనివల్ల ఏపీతో పాటు తెలంగాణ కూడా నష్టపోతుందన్నారు. ప్రజలకు తాగునీటిని ఇవ్వకుండా కర్కశకంగా వ్యహరిస్తున్నాయన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయనున్నామన్నారు.
 
పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు రావడం వల్ల ఎంతో మేలు కలిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నడమ పట్టిసీమ ద్వారా నీరు రాకుండే ఉంటే రైతాంగానికి ఎంతో నష్టం కలిగి ఉండేదన్నారు. గోదావరి జలాలను సోమశిలకు తరలించే ఆలోచన ఉందని, ఇందుకోసం లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.
 
పేద ప్రజల మాదిరిగానే హిజ్రాలకు పెన్షన్లు, ఇళ్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పించే ఆలోచన ఉందన్నారు. వృద్ధులతో పాటు బిక్షగాళ్లకు ప్రత్యేక ఆశ్రమాలు నెల్పకొల్పడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఆలోచన కూడా ఉందన్నారు. ఏపీయేతర ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే, 18004254440 నెంబర్ కు ఫోన్ చేయొచ్చునని సీఎం వెల్లడించారు.
 
కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక ప్రారంభించి ఇప్పటికి 4 నెలలు అవుతోందన్నారు. ఏప్రిల్ 21న ప్రారంభించగా, మే 2వ వారం నుంచి పూర్తిస్థాయిలో పని చేస్తోందన్నారు. పరిష్కార వేదిక ద్వారా ఎప్పటికప్పుడు వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడం, ఆ సమాచారం సంబంధిత శాఖలకు పంపడం, ప్రజల ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూడటం, ఆ సమాచారం ఫిర్యాదుదారులకు ఇవ్వడం ఒక పద్దతి ప్రకారం జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక పనిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిని సక్రమంగా వినియోగించుకోవడం పౌరుల బాధ్యతన్నారు. ఇక్కడ నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం అధికార యంత్రాంగం కర్తవ్యమన్నారు. ఈవారం కాల్ సెంటర్ ద్వారా ఉచిత ఇసుక విధానం, మద్యం షాపుల తరలింపు, బెల్ట్ షాపుల తొలగింపుపై ప్రజల నుంచి ప్రజాభిప్రాయం సేకరించామన్నారు.