తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం... కేబినెట్ ఆమోదం
తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధాన అమలుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. ఇదేవిధంగా వాటర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇసుక తవ్వకం విధానం, సాంస్కృతిక సారథిలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదేవిధంగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు (ఆర్అండ్బీ), రూరల్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు (పంచాయతీరాజ్), నెడ్క్యాప్ ద్వారా రైతులకు సోలార్ పంపు సెట్ల పంపిణీ, మహిళా భద్రత, మార్కెట్ కమిటీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్ఠం, సర్పంచిలకు మరిన్ని అధికారాలు, గర్భిణిలకు పౌష్టికాహారం పెంపు తదితర అంశాలకు చెందిన ముసాయిదా బిల్లులు వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కాగా హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కెసిఆర్ మురుగు కాల్వల మళ్లింపునకు వంద కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.100 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.