శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (15:23 IST)

అక్రమ కట్టడాలను కూల్చేస్తాం.. ఎవరడ్డొచ్చినా ఆగం.. కొండమీద గోపైనా సరే వదిలిపెట్టం : కేసీఆర్

హైదరాబాద్‌లో కురిసిన వర్షాలపై మీడియా అతిగా చూపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆయన వరదలు, వాననీటి పరిస్థితిపై సమీక్షిం

హైదరాబాద్‌లో కురిసిన వర్షాలపై మీడియా అతిగా చూపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆయన వరదలు, వాననీటి పరిస్థితిపై సమీక్షించారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ప్రస్తుతం ఉత్పన్నమైన పరిస్థితి నుంచి ఎదురైన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. సమగ్ర విధానంతో హైదరాబాద్‌ను తీర్చి దిద్దుతాం. ఇందుకు కఠిన నిర్ణయాలను, మెర్సిలెస్ విధానాలను అమలు చేస్తాం. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తాం. వర్షాలు తగ్గిన వెంటనే కూల్చివేత చేపడతాం' అని చెప్పారు. 
 
'హైదరాబాద్‌లో నాలాలపై 28వేల అక్రమ కట్టడాలున్నాయి. గత పాలకులు ప్రభుత్వ భవనాలను కూడా కట్టేశారు. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. ఏ ప్రజా ప్రతినిధుల ఇళ్లయినా వదిలిపెట్టం. ఎవరు అడ్డొచ్చినా ఆగం. కొండమీద గోపైనా సరే వదిలిపెట్టం' అని స్పష్టం చేశారు. నగరంలో 390 కి.మీ. నాలాలుంటే.. వాటిలో 170 కి.మీ. దాకా ఆక్రమణలున్నాయని, వాటిని కూలగొడతామన్నారు. వాటిలో పేదలుంటే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు. 
 
'అక్రమంకానీ సక్రమ బిల్డింగులను కూల్చేయాల్సి రావచ్చు. వారిని సంజాయించాల్సి, పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పట్టొచ్చు' అని చెప్పారు. అక్రమ కట్టడాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటే జీహెచఎంసీలో ఒక్క అధికారి కూడా మిగలడన్నారు. చెరువుల్లో అక్రమ లే అవుట్లకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టీడీపీ నాయకులేనని కేసీఆర్ తప్పుబట్టారు.
 
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్ రెడ్డి సమర్థంగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ కితాబునిచ్చారు. ఆయన్ను బదిలీ చేసేది లేదని స్పష్టం చేశారు. ‘‘నేను మార్చాలి కదా... నేను మార్చకుండా ఆయనెట్లా బదిలీ అవుతారు. ఆయన ఎఫిషియంట్‌ కమిషనర్‌గా ఉన్నారు’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.