సినిమా థియేటర్ పై పిడుగు.. బాలుడి మృతి
చిత్తూరు జిల్లా పెనుమూరులో గురువారం సాయంత్రం ఓ సినిమా థియేటర్ పై పిడుగు పడింది. పిడుగు పాటుకు ఓ బాలుడు మరణించాడు. థియేటర్ పాక్షికంగా దెబ్బతింది. వివరాలిలా ఉన్నాయి.
గురువారం పెనుమూరులో పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో స్థానికంగా ఉన్న రాధాకృష్ణ థియేటర్పై పిడుగుపడి రేకులు విరిగి సినిమా చూస్తున్న జ్ఞానశేఖర్ అనే బాలుడుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న బాలుడిని థియేటర్ యాజమాన్యం స్థానిక ఆసుపత్రికి తరలించింది.
అయితే స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో బాలుడు మృతి చెందాడు. అంతేకాకుండా పట్టణంలో వీచిన పెనుగాలులకు రోడ్లపై చెట్లు కూలిపడిపోవడంతో 108 వచ్చేందుకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.